సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. ఓ కేసులో భారతదేశపు యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఒక పెద్ద ట్రెండ్ పుట్టడానికి కారణమయ్యాయి. యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలకు నొచ్చుకున్న ఈ దేశపు యువత.. ఆయనపై ఓ వ్యంగ్యాస్త్రాన్ని సంధించగా.. ఆ వ్యాగ్యాస్త్రం కాస్తా ఇప్పుడు భారతదేశ రాజకీయ పార్టీలపై బ్రహ్మాస్త్రంగా మారింది. మమ్మల్నే వెక్కిరిస్తారా అంటూ ఆగ్రహించిన యువత చేసిన ఓ కొంటె పని బీజేపీ లాంటి రాజకీయ పార్టీలను సైతం వెనక్కితోసి సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. అదే.. కాక్రోచ్ జనతా పార్టీ.
మే 15వ తేదీన జరిగిన ఒక కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యువతను ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశారు. ముఖ్యంగా కొంతమంది నిరుద్యోగ యువకులు జర్నలిస్టులుగా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరిపై దాడులు చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగగా.. తన వ్యాఖ్యలను అందరూ అపార్థం చేసుకున్నారనీ.. బాధ్యత లేకుండా తప్పుడు దారిలో వెళ్తున్న యువతను ఉద్దేశించి మాత్రమే తాను ఈ వ్యాఖ్యలు చేశాననీ చెప్పారు. కానీ నిరుద్యోగ యువత మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా ఢిల్లీకి చెందిన దీప్కే అనే యువకుడు తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. అతని అసంతృప్తే.. కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి కారణమైంది.
కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ అయిన కొద్ది రోజుల్లోనే యువత నుంచి ఈ పార్టీకి విశేష స్పందన లభించింది. ఒక్క రాత్రిలోనే పది లక్షల మంది ఫాలోవర్లను సంపాదించిన ఈ అకౌంట్.. ప్రస్తుతం కోటిన్నర ఫాలోవర్లకు చేరువలో ఉంది. విచిత్రం ఏమిటంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉన్న ఫాలోవర్ల కంటే కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్న ఫాలోవర్ల సంఖ్య ఎక్కువ. ఇక్కడ ఇంకా పెద్ద విచిత్రం ఏమిటంటే.. అఖిలేశ్ యాదవ్.. మహువా మోయిత్రా వంటి ఫేమస్ పొలిటీషియన్లు కూడా ఈ పార్టీలో సభ్యత్వాన్ని తీసుకోవటం.
మమ్మల్ని వ్యవస్థ మరిచిపోయింది.. మమ్మల్ని సమాజం బద్ధకస్తులుగా పరిగణిస్తోంది.. అంటూ ఈ పార్టీలో చేరిన యువకులు స్లోగన్స్ పెడుతున్నారు. కావటానికి ఇది ఓ సెటైరికల్ పార్టీ అయినా.. యూత్ నుంచి వస్తున్న రియాక్షన్ మాత్రం వ్యవస్థను ఆలోచింపజేస్తోంది. ఒవరో కొంత మంది యువకులు డబ్బుల కోసమో లేక పాపులారిటీ కోసమో కొన్ని పనికిరాని పనులు చేస్తుంటారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయించేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రయత్నం ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. కానీ.. దేశ యువత మొత్తం అదే పని చేస్తోందనటం సరికాదు అనేది ఈ పార్టీ స్థాపించిన యువకుల ఉద్దేశం. తమకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తే లేదా ఏదైనా మంచి మార్గం చూపిస్తే.. ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఉండదు కదా అనేది వీరి వాదన. ఓ రకంగా చూస్తే వీరు చెప్పేది కూడా వాస్తవమే అనిపిస్తుంది.
కొంత మంది పెద్ద మనుషులు వెనుక ఉండి నిరుద్యోగులైన యువకులతో సుప్రీంకోర్టులో కేసులు వేయించి.. అర్థం పర్థం లేని వాదనలతో కోర్టు సమయం వృధా చేయిస్తున్నారు. జరగాల్సిన న్యాయాన్ని ఆలస్యం చేయటానికి మరియు కాలయాపన చేయటానికి మాత్రమే కనిపించని కొంత మంది పెద్ద మనుషులు నిరుద్యోగులను పావులుగా వాడుకొని కోర్టులను మరియు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. విజిల్ బ్లోయర్స్ పేరుతో ఆ యువకులను సొసైటీకి ప్రాజెక్ట్ చేసి వారికి పాపులారిటీ వచ్చేలా చేసి.. ఇదొక ఉపాధి రంగంగా తయారు చేశారు. ఇలాంటి పద్ధతి సరైనది కాదనే ఉద్దేశంతో జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఇంత పెద్ద ట్రెండ్కు కారణమయ్యాయి.
విషయం ఏమైనప్పటికీ.. ఇలాంటి సోషల్ మీడియా అకౌంట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవిగానే పరిగణించబడతాయి. ఇలాంటి అకౌంట్లు సృష్టించటానికి కారణం యువతలో ఉన్న నిరాశ లేదా కోపమే అయి ఉండవచ్చు.. కానీ దాని ప్రభావం ఓ సోషల్ మీడియా ఉద్యమానికి బాటలు వేసి.. అది కాస్తా దేశ వ్యతిరేకత పరిస్థితులకు దారి తీస్తే అది ప్రభుత్వానికి గండంగా మారుతుంది. రోజురోజుకీ ఈ పార్టీ ప్రభావం పెరిగిపోతుండటంతో సోషల్ మీడియాలో ఈ పార్టీకి సంబంధించిన అకౌంట్లన్నింటినీ బ్లాక్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ట్విటర్ ఈ అకౌంట్ను బ్లాక్ చేసినట్టు ప్రకటించింది కూడా.
బీజేపీని వణికించిన కాక్రోచ్ జనతా పార్టీ.. కోటిన్నర ఫాలోవర్లున్న అకౌంట్ ఇప్పుడు బ్లాక్
Published on
