చిత్ర విచిత్రమైన ఘటనలకు ప్రసిద్ధికెక్కిన దేశం నార్త్ కొరియా. గమ్మత్తైన ఘటనలు, పాలకుల విచిత్రమైన నిర్ణయాలతో ఈ దేశం పేరు తరచుగా అంతర్జాతీయ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు తీసుకున్న విచిత్రమై నిర్ణయం మరోసారి కిమ్ జోంగ్ ఉన్ పేరునూ నార్త్ కొరియా దేశం పేరునూ ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారేట్టు చేసింది. కొద్ది రోజుల క్రితం నార్త్ కొరియా సరిహద్దు పట్టణమైన హైసన్ సిటీలో ఈ యేడాది మొదట్లో అంటే జనవరిలో సైనిక బలగాల ఉపసంహరణ జరిగింది. చాలా మంది సైన్యం సరిహద్దు విధుల్లో నుంచి మారారు. ఈ సమయంలో సైనికులకు సంబంధించిన సుమారు 650 బుల్లెట్లు కనిపించకుండాపోయాయి. కొద్ది రోజులు బుల్లెట్ల కోసం హైసన్ సిటీలో గాలించినా అవి లభ్యం కాకపోవటంతో విషయం సైన్యాధికురులు అధ్యక్షుడికి చెప్పారు. దీంతో కిమ్ ఏకంగా లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నాడు.
కనిపించకుండా పోయిన బుల్లెట్లు దొరికే వరకూ హైసన్ లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దంటూ కిమ్ ఆదేశాలు జారీ చేశాడు. దీంతో ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇలాంటి నిర్ణయాలు నార్త్ కొరియాలో తరచూ కనిపించేవే. దేశంలో మాంసాహారానికి కొరత వచ్చిన సమయంలో మీ పెంపుడు జంతువులను చంపి వండుకొని తినండి అంటూ గతంలో కిమ్ జనాన్ని ఆదేశించాడు. ప్రజలంతా ఒకే రకం హెయిర్ స్టైల్ కలిగి ఉండాలనీ.. విదేశీ సినిమాలు చూడకూడదని.. కిమ్ పుట్టిన రోజును ప్రజలంతా పండగలా జరుపుకోవాలనీ.. కిమ్ మీటింగ్ లో నిద్రపోకూడదనీ.. ఇలాంటి విచిత్రమైన నిబంధనలు నార్త్ కొరియాలో అనేకం ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే తన కూతురు పేరుతో దేశంలో ఇంకెవరూ ఉండకూడదని.. కేవలం ఆ పేరు తన కుమార్తెకు మాత్రమే ఉండాలంటూ కిమ్ ఆదేశాలు జారీ చేసి ఇలాగే వార్తల్లోకెక్కాడు.