రాహుల్ గాంధీ సస్పెన్షన్ వివాదం రోజురోజుకూ ముదురుతున్న వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు కావటంలో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. దీనిపై వివరణ ఇచ్చిన ఎన్నికల కమిషన్.. రాహుల్ సభ్యత్వం రద్దు కావటం వల్ల వయనాడ్ లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉందని చెప్పింది. సాధారణ ఎన్నికలకు ఇంకా సంవత్సరం వ్యవధి ఉన్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం వయనాడ్ కు ఉప ఎన్నిక నిర్వహించాల్సిందే. నిబంధనలను అనుసరించి ఉప ఎన్నిక నిర్వహిస్తామని చెప్పిన ఎన్నికల సంఘం.. దీనిపై మరో కీలక వ్యాఖ్య చేసింది.
రాహుల్ గాందీ సభ్యత్వం రద్దు అయినప్పటికీ కోర్టు రాహుల్ శిక్షను నిలుపుదల చేస్తూ నెల రోజుల సమయం ఇచ్చిందనీ.. అంతే కాకుండా హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చిందని ఈసీ గుర్తు చేసింది. ఈ నెల రోజుల గడువు పూర్తి కావాటంతో పాటు సూరత్ కోర్టు తీర్పుపై పైకోర్టులు ఎలాంటి నిలుపుదల ఆదేశాలు జారీ చేయకపోతే అప్పుడు ఖచ్చితంగా వయనాడ్ లో ఉపఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది.