ఖాసిమ్ సులేమాని.. ఇరాన్ మిలిటరీ కమాండర్. 2020లో అగ్రరాజ్య అమెరికా సులేమానిని ఎలిమినేట్ చేసింది. అదికూడా పక్కా ప్లాన్ ప్రకారం బాగ్దాద్లో తన అత్యాధునిక ఎం క్యూ-9 రీపర్ డ్రోన్తో గుర్తుపట్టలేని విధంగా చంపేసింది. ఇక్కడే అమెరికా-ఇరాన్ మధ్య అప్పటికే దెబ్బతిన్న సంబంధాలు మరిం తగా బలహీనమయ్యాయి. ఆ సమయంలోనే అప్పటి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్పై రివేంజ్ ప్లాన్ చేసింది ఇరాన్. ఎప్పటికైనా డొనాల్డ్ ట్రంప్ అంతం తమ చేతుల్లోనే అని శపథం కూడా చేసింది. అయితే, ఈ హెచ్చరికలను తెంపరి ట్రంప్ అంతగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పటికీ ఇరాన్ అతడి అంతంకోసం ఏకంగా ఓ మిస్సైల్నే సిద్ధం చేసామని ప్రకటించిందంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
16వందల 50 కిలోమీటర్ల రేంజ్ ఉన్న క్రూజ్ మిజైల్. దీనిగురించి స్వయంగా ప్రకటించిన ఇరాన్ టాప్ కమాండర్ ఆమిర్ అలీ హజిజదేహ్.. ఇరాన్ మిలిటరీ కమాండర్ కాసిమ్ సోలిమనీని చంపినందుకు ప్రతీకారంగా ట్రంప్ను హతమార్చుడానికే ఈ మిస్సైల్ని వినియోగిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ హెచ్చరికల తరవాత పశ్చిమ దేశాలన్నీ ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఆ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. రష్యా ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో అంచనా వేయలేని పరిస్థితి. పైగా పుతిన్ ఉక్రెయిన్పై దాడి కోసం ఇరాన్ డ్రోన్లనే వినియోగిస్తున్నారు. అటు అమెరికా ఉక్రెయిన్కు మద్దతు ప్రకటించింది. ఇలాంటి కీలక తరుణంలో ఇరాన్ ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడిని చంపేస్తామని హెచ్చరించడం సంచలనమవుతోంది. కేవలం ట్రంప్ ఒక్కరినే కాదు సులేమాని హత్యకు ఆదేశాలు జారీ చేసిన అప్పటి విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, ఆ దేశ మిలిటరీ కమాండర్లు కూడా ప్రాణాలతో ఉండకూడదని హజీజాదే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
2020 ట్రంప్ సర్కార్ ఖాసిమ్ సులేమానిని అంతం చేయడానికి చాలా పెద్ద రీజనే ఉంది. సులేమాని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్లోని అత్యంత శక్తిమంతమైన కుర్ద్ ఫోర్స్కు జనరల్గా వ్యవహరించారు. సులేమానీ నేతృత్వం వహిస్తున్న కుర్ద్ ఫోర్స్ ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో షియా ముస్లింలకు అనుకూలంగా కార్యకలాపాలను సాగిస్తుంటుంది. ముఖ్యంగా లెబనాన్లో హిజ్బుల్లా పక్షాలకు బలమైన అండ. దీని అండతోనే హిజ్బుల్లా లెబనాన్లో పాలన చేసింది. ఇక ఇరాక్లో కూడా కుర్దులు, షియాలకు అనుకూలంగా ఈ దళం పనిచేస్తుంది. ఈ కార్యకలాపాలు.. వ్యూహాలు.. దాడులు.. ప్రతిదాడులు మొత్తం సులేమానీ కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల సమయంలో సులేమానీ నేరుగా అమెరికాపై బెదిరింపులకు దిగారు. “మిస్టర్ ట్రంప్.. ఓ జూదగాడా.. మేము నీకు చాలా దగ్గరగా ఉన్నాం. ఆ ప్రదేశం నీ ఊహకు కూడా అందదు. నువ్వు యుద్ధం మొదలెడితే.. మేం యుద్ధాన్ని ముగిస్తాం” అని హెచ్చరించారు.
ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చుట్టుపక్కల దేశాల్లో పరోక్షంగా షియాలకు అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఘర్షణలు, దాడులు, వేర్పాటువాదులను ప్రోత్సహిస్తుంది. లెబనాన్లో హిజ్బుల్లా ప్రభుత్వం, యెమెన్లో హౌతీ రెబల్స్, సిరియాలో అసద్ ప్రభుత్వం, ఇరాక్లో షియా గ్రూపులకు సులేమానీ మార్గ దర్శకత్వం చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో సులేమాని పలుమార్లు ప్రాణగండాలను కూడా తప్పించుకున్నారు. 2006లో ఒక విమాన ప్రమాదంలో ఆయన మృతిచెందినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2012లో డమాస్కస్లో జరిగిన బాంబుదాడి నుంచి సురక్షితంగా తప్పించుకొన్నారు. 2015లో కూడా సిరియాలోని అలెప్పొలో జరిగిన దాడిలో మరణించారనే ప్రచారమూ జరిగింది. చివరికి 2019 డిసెంబర్ 28న ఇరాక్లో ఒక అమెరికా కాంట్రాక్టర్ హత్యకు గురైయ్యాడు. అప్పుడు అమెరికా బలగాలు కొన్ని లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆ తర్వాతి రోజు నుంచి బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై షియా బృందాలు భీకర దాడులకు తెగబడ్డాయి. వీటన్నింటిని కుర్ద్ ఫోర్స్ వెనుకుండి నడిపిస్తోందని అమెరికాకు అర్థమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా ఇరాక్లోనూ అమెరికా వ్యతిరేక వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి సులేమానీను టార్గెట్ చేసింది.
లెబనాన్ నుంచి కానీ, సిరియా నుంచి కానీ వస్తున్నట్లు భావిస్తున్న ఒక విమానంలో సులేమానీ ఉన్నట్లు సమాచారం అందింది. అక్కడకు పాపులర్ మొబలైజేషన్ ఫోర్స్ నేత ముహందీస్ కూడా రానున్నట్లు తెలిసింది. అప్పటికే కసి మీద ఉన్న అమెరికా దళాలు ఆపరేషన్కు ప్రణాళికలు రూపొందించాయి. ముహందీస్ కూడా క్వాన్వాయ్తో విమానాశ్రయం చేరుకొన్నారు. సులేమానీ విమానం దిగి ముహందీస్ను కలవగానే అప్పటికే మాటేసి ఉన్న ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ రాకెట్లతో దాడి చేసింది. ఆ దాడిలో సులేమాని చేతి వేలికి ధరించిన ఎర్రటి ఉంగరం ద్వారానే అతడి డెడ్బాడీని గుర్తుపట్టగలిగారు. ఆ సమయంలో ఇరాన్ మొత్తం అట్టుడికిపోయింది. సులేమాని అంత్యక్రియల తర్వాత అతని కుమార్తె సైతం ట్రంప్కు వార్నింగ్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ సులేమానీ హత్యకు ప్రతీకారం కోసం ఇరాన్ ఎదురు చూస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ట్రంప్ ఎలిమినేషన్ కోసం ఏకంగా అత్యాధునిక మిస్సైల్ను సిద్ధం చేసినట్టు ప్రకటించి ప్రపంచ దేశాల్లో గుబులు రేపుతోంది.
ఇరాన్ ప్రకటించినట్టే సులేమానీ హత్యకు ప్రతీకారంగా ట్రంప్ను హతమారిస్తే పరిస్థితులు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. ఇరాన్ పదే పదే ఈ తరహా హెచ్చరికలు చేయడం.. ఈ క్రమంలోనే రష్యాతో మిత్రబంధాన్ని పెంచుకోవడం.. మాస్కోకు డ్రోన్లను కూడా సరఫరా చేయడం లాంటి పరిణామాలు టెన్షన్ పెడుతున్నాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా ఇరాన్ డ్రోన్లను ఉపయోగించడంపై అమెరికా సహా పశ్చిమ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా ఇరాన్ క్రూజ్ క్షిపణి అభివృద్ధి చేయడం ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసినట్లైంది. మరి ఇరాన్ యాక్షన్కు అమెరికా ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాలి.