దేశ రాజధాని ఢిల్లిలో బుధవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. 2 గంటల ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూప్రకంపనలు నమోదైనట్టు జాతీయ భూకంపాల అధ్యయన కేంద్రం ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్, హర్యాణా, నేపాల్ లో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయని చెప్పారు. చెన్నైలోనూ భూమి కంపించిందంటూ జాతీయ భూకంపాల పరిశోధన కేంద్రం వెల్లడించింది. ఢిల్లీలో భూ ప్రకంపనలతో వణికిపోయిన జనం ఇళ్ళ నుంచి పరుగులు తీశారు. అయితే.. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు నమోదు కాలేదు.
కొద్ది రోజుల క్రితం టర్కీ, సిరియా దేశాల సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. వేలాది మందిని పొట్టన పెట్టుకున్న టర్కీ భూకంపం.. ఆ దేశాల చరిత్రలో అతిపెద్ద విపత్తుగా నమోదైంది. టర్కీ భూకంపం నేపథ్యంలో భారత్ లో కూడా భూ అంతర్భాగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నదనీ.. రాబోయే రోజుల్లో భారత్ లో కూడా భూంకంపం సంభవించే అవకాశాలు కొట్టి పారేయలేమనీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో సంభవించిన భూకంపం అందరినీ వణికిస్తోంది. ఎప్పుడు ఏ ప్రళయం ముంచుకొస్తుందోననే భయం వెంటాడుతోంది.